వదినమ్మ బహుమతిని అందుకున్న పవన్ కల్యాణ్

హైదరాబాద్, ముద్ర వార్తలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత ఘన విజయం సొంతం చేసుకుని, ఉపముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన కొణిదెల పవన్ కల్యాణ్ కు ఆయన వదినమ్మ, చిరంజీవి సతీమణి సురేఖ విలువైన బహుమతిని అందించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సురేఖ ఆయనకు అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు. సురేఖ స్వయంగా పెన్నును పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా, ఆయన ఎంతో సంతోషించారు. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర వున్న పెన్నును తీసి చూపించారు. ‘ఇది కూడా అట్టిపెట్టుకో’ అని సురేఖ అన్నారు. ఆ సందర్భంలో ఒక వైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వచ్చారు. నలుగురూ కలసి ఒక మెమరబుల్ ఫొటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ వదిన, అన్నయ్య’’ అంటూ చిరంజీవి వీడియోను ముగించారు. పవన్ కళ్యాణ్‌కి సురేఖ అందించిన మోంట్‌బ్లాంక్ పెన్ను ఖరీదు ఎంత వుంటుందో తెలుసా… దాదాపు 2 లక్షల 75 వేల రూపాయలు.