ఆరు గ్యారెంటీ లు తెలంగాణ ప్రజల కోసమే

ఆరు గ్యారెంటీ లు తెలంగాణ ప్రజల కోసమే
  • మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర. వీపనగండ్ల:-కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.చిన్నంబావి మండలం వెల్ టూర్ గ్రామంలో ఆదివారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు ఆరు గ్యారెంటీ లను గ్రామ ప్రజలకు, మహిళలకు వివరిస్తూ వాటి వలన సామాన్య ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో వివరించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా విజయ భేరి సభలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆరు గ్యారెంటీ లను ప్రకటించారని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క  లబ్ధిదారులకు ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని జూపల్లి  ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు జూపల్లి  దృష్టికి వివిధ సమస్యలను తీసుకు వస్తు గ్రామంలో ఇందిరమ్మ ఉన్నప్పుడే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని,కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే ఇప్పటికీ ఉన్నాయని వారు అన్నారు. ఏదైనా దవాఖాన కు పోతే ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే చూయించు కుంటున్నామని, అలాంటి మంచి పనులు మరింత ఎక్కువ సహాయపడేల చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని ఆనాటి సంక్షేమ పథకాల వల్ల వారు పొందిన లబ్ధినీ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, చిన్నంబావి సర్పంచ్ రంజిత్ కుమార్, నాయకులు కళ్యాణ్ రావు, నారాయణ తదితరులు ఉన్నారు.