భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు

భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ప్రధాని మోదీ దురహంకారం, నియంతృత్వానికి పరాకాష్ట అని విమర్శించారు.
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.