చిత్తశుద్ధితో పనిచేసి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం..

చిత్తశుద్ధితో పనిచేసి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం..
  • ఐఎన్ టియుసి విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:సింగరేణి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసి, కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి సింగరేణి ఎన్నికల్లో ఐఎన్ టియుసి గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా భూపాలపల్లి పట్టణంలో ఐఎన్ టియుసి ఆధ్వర్యంలో ఆదివారం 300 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు సొంత ఇంటి స్థలం అందించడం జరుగుతుందని, మిత్తి లేకుండా 20 లక్షల రూపాయల రుణం అందించడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి ఏరియా హాస్పిటల్ లో వైద్య పరికరాలు సమకూర్చి, వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని, కార్మికులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపుతామన్నారు. సింగరేణి క్లారికల్ పోస్టులో ఉన్న మహిళలు బావిలో దిగకుండా పనిచేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్ టియుసీ అనుసంధానంగా పనిచేసి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. భూపాలపల్లిలో ఐఎన్టీయూసీని గెలిపించిన కార్మికులందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి, బాణాసంచాలు కాల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య, జాతీయ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్, భూపాలపల్లి యూనియన్ ఎన్నికల ఇన్చార్జి పేరం రమేష్ తో పాటు సింగరేణి కార్మికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.