భూపాలపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

భూపాలపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ కరుణాకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రసంగించారు. వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లాకు నూతనంగా కేటాయించిన అంబులెన్స్ లను ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పనకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చెక్కులని అందించారు.రెండవ విడత గొర్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సంబందిత లబ్దిదారులకు పత్రాలను అందించారు. అంతకుముందు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో  ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.