పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా?

పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా?
  • టీచర్ల ట్రాన్స్​ఫర్ పై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
  • తదుపరి విచారణ ఆగస్టు 23కు వాయిదా

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీచర్ల బదిలీ వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండ్లి చేసుకుంటే బదిలీ చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయుల బదిలీలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పెండ్లి చేసుకుంటే బదిలీ చేస్తామంటే ఎలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భార్యభర్తలు ఒకే చోట ఉండాలన్నదే తమ ఉద్దేశమని, ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇచ్చామని, బదిలీల నిబంధనలను సవరించామని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. స్టే ఉన్నందున బదిలీ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. బదిలీల నిబంధనలు సవరించామని, నిబంధనల సవరణలను అసెంబ్లీ కౌన్సిల్ ముందు ఉంచామని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. అనంతరం నిబంధనలో మార్పులపై హైకోర్టుకు మెమో సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ త్వరగా చేపట్టాలని ఏజీ కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది.