గ్రూప్ -4 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలి

గ్రూప్ -4 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలి
  • నిమిషం ఆలస్యం అయిన అనుమతి లేదు  
  • జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో, ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై -1న ఉదయం 10 గంటల నుండి 12-30 గంటల వరకు , మధ్యాహ్నం 2-30 నుంచి 5 గంటల వరకు పరీక్షా జరుగునని, ఉదయం 8 గంటల నుండి 9-45  వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2-15 గంటల వరకు పరీక్షా సెంటర్ లోనికి అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని, పరీక్ష సమయానికి 15 నిమిషాల  ముందే మెయిన్ గేట్ మూసి వేయడం జరుగుతుందని  సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా సమయానికి ముందస్తుగా వచ్చి ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్ వంటివి, అనుమతి లేనివి తీసుకొని రావద్దని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకరావాలని, మహిళలు విలువైన ఆభరణాలు ధరించి పరీక్ష హాలుకు రావద్దని సూచించారు. ఒరిజినల్ హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ వ్యాలిడిటి ఫోటో ఐ.డి. గుర్తింపు కార్డ్ తీసుకొని రావాలని సూచించారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలలో 21,937 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులు హల్ టికెట్ పై ఫోటో, సంతకం పరిశీలన చేసుకోవాలని, హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా లేని పక్షంలో గెజిటెడ్ అధికారి చే ధృవీకరించిన 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లు తీసుకొని రావాలని,  లేనిపక్షంలో పరీక్ష రాయడానికి అనుమతించ బోరని  కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ఓ.ఎం.ఆర్. షిట్ పై  సూచనలు చదవాలని, హాల్ టికెట్ నెంబర్, ప్రశ్నా పత్రం నెంబర్ సరిగ్గా నమోదు చేయాలని, ప్రశ్న పత్రంలో  ఏమైనా ప్రింటింగ్ సరిగా లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్ కు సమాచారం అందించాలని తెలిపారు.  పరీక్షా హల్ లో ప్రతి అరగంటకు ఒకసారి బెల్ మోగించడం జరుగుతుందని, చివరి 5 నిమిషాలను సూచిస్తూ హెచ్చరిక  బెల్ మోగుతుందని, దీనికి అనుగుణంగా అభ్యర్థులు పరీక్ష రాయాలని తెలిపారు. ఓఎంఆర్ షిట్ పై వైటనర్, ఎరైజర్, వివిధ రకాల ట్యాంపరింగ్ పాల్పడితే  ఆ ఓఎంఆర్ షిట్ చెల్లదని, పరిక్షా కేంద్రాల్లో ఇతరులతో మాట్లాడటం,  పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ అప్పజెప్పిన తర్వాత ఎడమచేతి బొటనవేలి ముద్ర ఇవ్వాలని  కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.