రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం లో సీఎం కేసీఆర్
![రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం లో సీఎం కేసీఆర్](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649412a71813c.jpg)
ఎక్కడా లేని విధంగా కఠినమైన విధానాలతో తెలంగాణ టీఎస్ ఐపాస్
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : మేధా గ్రూప్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీగా రికార్డు సృష్టించిన ఈ ఫెసిలిటీని రూ.1,000 కోట్లతో నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభం కావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి లభించనున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ మేధా కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు.
మేధా కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ కర్మాగారంలోని మొత్తం మెషినరీని పరిశీలించారు. అక్కడ రైల్ కోచ్లను ఎలా తయారు చేస్తారో పూర్తి వివరాలు అక్కడి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ మొత్తం చూశానని.. రైల్వే విడి భాగాలు ఎంతో బాగా స్కిల్తో చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఇంత అద్భుతమైన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మేధా గ్రూప్ కుటుంబానికి అభినందనలని చెప్పారు. తెలంగాణ బిడ్డలే రైలు కోచ్లు, విడిభాగాల తయారుచేయడం గర్వకారణం అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కఠినమైన విధానాలతో తెలంగాణ టీఎస్ ఐపాస్ తీసుకొచ్చామని చెప్పారు. ఇందుకోసం 70 నుంచి 80 దేశాల విధానాలను పరిశీలించామని తెలిపారు. సింగిల్ విండో విధానం తీసుకొచ్చి.. 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధికారుల టేబుల్పై ఫైల్ ఆగితే రోజుకు రూ. 1,000 రూపాయలు ఫైన్ వేస్తున్నట్టుగా చెప్పారు.
మన దేశంలోనే, మన ఇంజనీర్లతో రైల్ కోచ్లను నిర్మించాలనే లక్ష్యంతో మేధా కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు నిర్వాహకులు చెప్పారు. ఇండియాలోనే కాకుండా మరో ఐదు దేశాల్లో మేధా సంస్థకు ఫ్యాక్టరీలు ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం వివరించింది. తెలంగాణలో కంపెనీని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, పరిశ్రమల మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మేధా గ్రూప్ కేవలం కోచ్ తయారీనే కాకుండా.. రైల్వేలకు సంబంధించి సిగ్నలింగ్, ఇతర వ్యవస్థలను కూడా తయారు చేస్తున్నట్లు యాజమాన్యం చెప్పింది.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మల్లారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేథా పరిశ్రమ ఎండీ కశ్యప్రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.