స్వగ్రామానికి చేరిన మృతదేహాలు...

స్వగ్రామానికి చేరిన మృతదేహాలు...
  • శోకసంద్రమైన చౌటపల్లి.......
  • ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు అన్న గ్రామస్తులు...

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురి మృతదేహాలను స్వగ్రామానికి చేర్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు బుధవారం ఉదయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపాన కారు బోల్తా పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ప్లంబర్ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునే వీరంతా స్వగ్రామంలో జరిగిన బాబాయి అంత్యక్రియలో పాల్గొని తిరిగి వెళుతున్న క్రమంలో  రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులంతా తల్లా డిల్లి పోగా ,గ్రామం మొత్తం శోక సముద్రమైంది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎరుకల కృష్ణ గౌడ్, ఎరుకల సంజయ్ గౌడ్, ఎరుకల సురేష్ గౌడ్ ,ఎరుకల శ్రీనివాస్ గౌడ్, మృతదేహాలకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి పోస్ట్మార్టం పూర్తి కాగానే తిరిగి చౌటపల్లి గ్రామానికి బయలుదేరారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నలుగురి అన్నదమ్ముల మృతదేహాలు చౌటపల్లి గ్రామంలోని వారి సగృహాలకు చేరాయి. నిన్నటి వరకు తమ వెంట ఉండి అందరితో ఆప్యాయంగా మాట్లాడి ,మళ్లీ వస్తామంటూ వెళ్లిన నలుగురు కుమారులు విగత జీవులై రావడంతో వారి తల్లిదండ్రులు . భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు,తల్లడిల్లిపోయారు. గ్రామస్తులు మొత్తం రాజయ్య గౌడ్, రాములు గౌడ్ ఇండ్ల వద్దకు చేరుకొని తీవ్రంగా రోదించారు. ఇటువంటి దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదు అంటూ వారు భగవంతుని వేడుకున్నారు.ప్రమాద సమయంలో  ప్రాణాలతో బయటపడ్డ సురేష్ గౌడ్ కుమారుడు భార్గవ్ రామ్ గౌడ్ తన  తండ్రి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండడం అందర్నీ కలిసి వేసింది.