జనగామలో ‘డబుల్’ లొల్లి
- సీపీఎం ఆధ్వర్యంలో ఇండ్ల ముట్టడి
- ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఇండ్ల వద్దకు చేరుకున్న లీడర్లు
- పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తం
ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా లో ‘డబుల్’ లొల్లి మొదలైంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని బాణాపురం ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కమిటీలను వేసింది. ఈ నెల 13, 14న పట్టణంలోని వార్డుల వారీ సమావేశాలు నిర్వహించి ఎంపిక చేపట్టేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం మీడియాకు నోట్ రిలీజ్ చేశారు. ఆన్లైన్, ఆఫ్ లైన్లో వచ్చిన దరఖాస్తులను కమిటీలు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ పర్యవేక్షణలో ఈ మీటింగ్లు జరుగనున్నాయి.
సీపీఎం ఆధ్వర్యంలో ఇండ్ల ముట్టడి
ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలతో కలిసి సీపీఎం లీడర్లు ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఇండ్ల ముట్టడి చేపట్టారు. దాదాపు 600 మంది జనం అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని ఇది పద్ధతి కాదని సముదాయించినా ఫలితం లేదు.