నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం

నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం

ముద్ర,తెలంగాణ:-గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్త తెలియజేసింది వాతావరణ శాఖ. ఈరోజు నుండి 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం నల్లగొండ, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మలాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసారు అధికారులు.

అలాగే నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి అనుకున్న తేదీ కన్నా ముందే ప్రవేశించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అసోం, బెంగాల్‌, సికింలోకి ప్రవేశించాయని తెలిపింది. లక్షద్వీప్‌, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. జూన్‌ 5 నుంచి 11 తేదీల మధ్య తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.