హైదరాబాద్ @ 42
- రాష్ట్రంలో నిప్పులు కురిపిస్తున్న భానుడు
- వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు
- నిడమనూరులో 43.5 డిగ్రీల ఎండ
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భానుడు నిప్పులు గక్కుతున్నాడు. ఎండలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరాయి. గురువారం అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీక్య తండా(నల్గొండ)లో 43.4, ధరూర్(జోగులాంబ) 43.4, పెబ్బేరు(వనపర్తి) 43.3, నాంపల్లె(నల్గొండ) 43.2, కోరట్పల్లి (నిజామాబాద్) 43.1, బుగ్గబావి గూడ (నల్గొండ) 43.1, తిరుమలగిరి (నల్గొండ) 43.1, తెల్దేవరపల్లె (నల్గొండ) 43, వడ్డేపల్లి (జోగులాంబ) 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు టీఎస్డీపీఎస్ పేర్కొంది. వచ్చే మూడురోజుల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.