యువత మేలుకో, గంజాయి మానుకో
![యువత మేలుకో, గంజాయి మానుకో](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6448c7f02ac4f.jpg)
- జగిత్యాల ట్రాఫిక్ పోలిస్ అధ్వర్యంలో విస్తృత ప్రచారం
- జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ యువకులకు సూచన
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: యువత మేలుకో, గంజాయి మానుకో అంటూ జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. గంజాయి మత్తులో పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ సూచనల మేరకు జగిత్యాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై ఎల్ రాము ఆధ్వర్యంలో పోలీసులు జగిత్యాల పట్టణంలోని పలు ఆటోలకు బ్యానర్లు ఏర్పాటు చేసి, ప్రభుత్వ నిషేదిత గంజాయి గురించి 24 గంటల పాటు జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. గంజాయి సాగుచేసిన, కొన్న, విక్రయించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారికి సంవత్సరం నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష తో పాటుగా లక్ష నుండి 20 లక్షల వరకు జరిమానా ఉంటుందని తెలిపారు. గంజాయి సాగు, రవాణా, నిల్వ చేస్తున్నట్లు సమాచారం ఉంటే 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి సంబంధించిన వివరాలు గొప్యంగా ఉంచబడతాయని తెలిపారు.