లక్ష్మీదేవి నెక్లెస్‌ వివాదం.. తాప్సీపై కేసు నమోదు

లక్ష్మీదేవి నెక్లెస్‌ వివాదం.. తాప్సీపై కేసు నమోదు

ముంబయి: బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను  పై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్‌ తాప్సీపై ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో ఆమె లక్ష్మీదేవి నెక్లెస్‌ను ధరించడాన్ని తప్పుబట్టిన ఆయన.. ఈ మేరకు పోలీసులకు కంప్లెయింట్‌ చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా తాప్సీ వ్యవహరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.  వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ ఇటీవల లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నారు. మార్చి 12న ముంబయి వేదికగా జరిగిన ఈ షోలో ఆమె శరీరం కనిపించేలా ఎర్రని గౌను ధరించి.. దానికి అనుగుణంగా ఓ ఖరీదైన బంగారపు నెక్లెస్‌ను మెడలో వేసుకున్నారు. అయితే, ఆ నెక్లెస్‌పై లక్ష్మీదేవి డిజైన్‌ ఉండటం వివాదానికి కారణమైంది. అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి లక్ష్మీదేవి నెక్లెస్‌ వేసుకోవడం పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాప్సీ డ్రెస్సింగ్‌ పట్ల అసహనం వ్యక్తం చేసిన ఏకలవ్య గౌర్‌.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఓ మతాన్ని అవమానించేలా తాప్సీ ప్రవర్తించారని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.