మహిళా సంక్షేమమే మన ప్రభుత్వ  ధ్యేయం

మహిళా సంక్షేమమే మన ప్రభుత్వ  ధ్యేయం
  • ఆర్ పీలతో పాటు గ్రామ వి. ఓ.ఏ లకు రు 10 వేల వేతనం అందేలా కృషి
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహిళా సంక్షేమం ప్రభుత్వల బాధ్యత అని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కు కట్టుబడి ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో మెప్మా పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ ల సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసిన సమావేశంకు జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రిసోర్స్ పర్సన్ ల సంఘం పక్షాన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవన్ రెడ్డి కి ఆర్. పీ లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళ సాధికారత, బలోపేతం తోనే కుటుంబం, సమాజం బాగుపడుతుందన్నారు. 2004లో స్వర్గీయ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులకు అండగా నిలిచేందుకు పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించి అమలు చేశారన్నారు.

2009-14 మధ్య కాలంలో పావలా వడ్డీ స్థానంలో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలు అయ్యిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వడ్డీ రాయితీ అమలు చేయకపోగా, అమలు ప్రయత్నం సైతం పెండింగ్ లో ఉండడం దురదృష్టకరం అన్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరిన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్. పీ లకు గత ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదలయ్యేలా చూడడం తో పాటు, ఏప్రిల్ తర్వాత రిసోర్స్ పర్సన్ లకు రూ.10 వేల గౌరవ వేతనం అందేలా చూస్తమని, ఇదే తరహాలో గ్రామ స్థాయిలో పనిచేసే వి.ఓ.ఏ లకు సైతం పదివేల వేతనం అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం ఆలోచన విధానమే మహిళా సంక్షేమమని, అందుకే మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

ప్రభుత్వం, మహిళా సంఘలా ద్వారా మహిళలోకానికి వారధిగా ఉన్న రిసోర్స్ పర్సన్ లు, గ్రామ స్థాయిలో వీఒఎ ల పాత్ర కీలకం అని, వారి సేవలకు అండగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ వేతనాలు విడుదల చేయించడం తో పాటు ఏప్రిల్ తర్వాత జీవో ప్రకారం వచ్చే 6000/- సంఘాల ద్వారా వచ్చే 2000/-లను కలుపుకొని ప్రభుత్వం మరో రెండు వేలు కలిపి మొత్తంగా రూ.10 వేల గౌరవవేతనం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. వీటితో పాటు సమస్యల పరిష్కారం, అవసరమైన సహకారం అందిస్తామన్నారు. జగిత్యాల పట్టణంలో ఉన్న మెప్మా బిల్డింగ్ ను తిరిగి మెప్మా కే అప్పగించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశం లో ఆర్ పి ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం, జిల్లా మహిళా.కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత తో పాటు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.