నిజాల కోసం.. చర్చకు సిద్ధం | Mudra News

నిజాల కోసం.. చర్చకు సిద్ధం | Mudra News
  • ఎక్కడికి రమ్మంటారో చెప్పండి
  • ప్రెస్ క్లబ్ కా . అమరవీరుల స్తూపం దగ్గరకా? 
  • సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్
  • దేశ ఆర్థిక పరిస్థితి మీద అబద్ధాలు చెబుతున్నారు 
  • కేంద్రంపై బురదజల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారు
  • రాజీనామా కోసం తొందరపడకండి.. సమయం దగ్గరలోనే ఉంది
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి వైఫల్యాల గురించి ఎందుకు మాట్లాడరు?


మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ఆగ్రహం

ముద్ర, తెలంగాణ బ్యూరో: దేశ ఆర్థిక పరిస్థితులు, జీడీపీ గురించి అసత్యాలు, అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితులపై చర్చించేందుకు ముందుకు రావాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే, గౌరవప్రద భాషలో మాట్లాడతానంటేనే చర్చకు వస్తానన్నారు. చర్చల కోసం ప్రెస్ క్లబ్ అయినా, అసెంబ్లీ ముందున్న అమర వీరుల స్తూపం వద్ద అయినా తాను సిద్ధమేనన్నారు.సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధిరేటు, తలసరి ఆదాయంపై కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్న కేంద్ర మంత్రి, కరోనానంతర పరిస్థితులలో  ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే, నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతదేశం ఆర్థిక సాధికారత సాధించే దిశగా దూసుకెళ్తుండటాన్ని యావత్ ప్రపంచం హర్షిస్తోందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను, తలసరి ఆదాయాన్ని బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, సింగపూర్ దేశాలతో పోల్చడం కేసీఆర్ అవగాహనా రాహిత్యమన్నారు. ఏ ఆర్థికవేత్తకు కూడా అర్థం కాని రీతిలో ఎటువంటి ఆధారాలు లేకుండా పచ్చి అబద్దాలు కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశాన్ని బద్నామ్ చేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ప్రజలకు అర్థమవుతోందన్నారు. జనాభా తక్కువగా ఉన్న దేశాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం సహజమేనని, ఈ విషయం కూడా కేసీఆర్ కు తెలియకోవడం హాస్యాస్పదమన్నారు. సింగపూర్ గురించి మాట్లాడిన కేసీఆర్ కు ఆ దేశ జీడీపీలో 471 శాతం అప్పులు ఉన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. అమెరికా జీడీపీలో 120 శాతం అప్పు చేసింది, యూకే (బ్రిటన్) 273 శాతం అప్పు చేసింది. అలాంటిది భారత్ జీడీపీలో 19.9 శాతానికి మించి అప్పు చేయటానికి వీల్లేదు, ఇది గొప్ప నిర్ణయం కాదంటారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోలుస్తూ భారతదేశాన్ని విమర్శించడం కల్వకుంట్ల కుటుంబానికి పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రం కోసం ఏం చేసారో చెప్పకుండా
రాష్ట్రం కోసం కల్వకుంట్ల కుటుంబం ఏం చేసిందో అసెంబ్లీలో  చెప్పుకోకుండా బీజేపీని, మోదీని తిట్టేందుకు వేదికగా,  ఓ పొలిటికల్ సమావేశంగా మార్చుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లడమే టార్గెట్ గా సమావేశాలు నిర్వహించారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలలో ఆదరణ తగ్గిపోయిందని, బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ఇది కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారన్నది ఆయన మాటలలోని నిరాశ, నిస్పృహ, నిర్వేదం ద్వారా స్పష్టంగా కనిపించాయని అన్నారు. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసిన కేసీఆర్, శాసనసభలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తన పార్టీలోకి లాక్కున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో జతకట్టే ఆలోచనతోనే ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ సర్కారును, ఇందిరాగాంధీ పాలనను పొగుడుతూ వ్యాఖ్యలు చేశారన్నారు. యూపీఏ హయాంలో దేశం అవినీతి కోరలలో చిక్కుకుపోతే, ఆ పాలనను ప్రశంసిస్తూ కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మన్మోహన్ సింగ్ పాలనలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్, మోడీ వచ్చాక 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం కేసీఆర్ కు కనిపించడం లేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మొన్నటివరకు కేంద్ర ప్రథకాలను అద్భుతమంటూ కీర్తించిన నోటితోనే కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు కమ్యూనిస్టులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు వారిని పొగుడుతున్నారన్నారు. ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందే కల్వకుంట్ల కుటుంబం రాజీనామా చేసేందుకు తొందరపడాల్సిన పనిలేదని, ఆ తర్వాత ఎలాగూ గవర్నర్ కు రాజీనామా ఇవ్వక తప్పదని కిషన్ రెడ్డి అన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్.. హైదరాబాద్–రంగారెడ్డిలో పర్ క్యాపిటా ఇన్ కమ్ ఎంత? ఆసిఫాబాద్ కొమురంభీమ్ జిల్లాలో పర్ క్యాపిటా ఇన్ కమ్ ఎంత అనే విషయాన్ని కూడా చెబితే ప్రజలు స్వాగతిస్తారని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం మాదిరిగా అప్పులు చేసి కమీషన్లు కొట్టేసే ప్రభుత్వం కేంద్రంలో లేదన్నారు. వేల కోట్ల దోపిడీ జరుగుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నాం
జమ్మూ–కశ్మీర్ లో ఇన్నాళ్లూ ఆర్టికల్ 370ని అడ్డంపెట్టుకుని జిన్నా రాజ్యాంగాన్ని అమలుచేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. దేశమంతా నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు, జమ్మూ–కశ్మీర్ లో జరగలేదని, అందుకే ప్రస్తుతం అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందని వెల్లడించారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అమలయ్యేలా చూడటం, అందరికీ న్యాయం జరిగేలా పనిచేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.