పోలీసుల నుంచి టాక్సికాలజీ రిపోర్టు అందలేదు: ప్రీతి తండ్రి నరేందర్
వరంగల్: ఇటీవల మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారని ఆమె తండ్రి నరేందర్ మరోసారి ఆరోపించారు. ప్రీతి కుటుంబసభ్యులు హైదరాబాద్లో డీజీపీని కలిశారు. అనంతరం నరేందర్ మీడియాతో మాట్లాడారు. ''పోలీసుల నుంచి మాకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్టు అందలేదు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరేందుకు వచ్చాం. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని కోరుతున్నాం. ఆదివారం వరంగల్లోని మట్టెవాడ పోలీసులు మా ఇంటికి వచ్చి మరోసారి వాంగ్మూలం నమోదు చేశారు. టాక్సికాలజీ రిపోర్టు వచ్చినా కాజ్ ఆఫ్ డెత్ క్లియర్గా తెలియదు. టాక్సికాలజీ కోసం తీసుకున్న నమూనాలు, అప్పుడే ఎక్కించిన రక్తం నమూనాలు తీసుకున్నారు కాబట్టి సరైన రిపోర్టు రాదని డాక్టర్లు చెప్పారు'' అని నరేందర్ అన్నారు.