కలెక్టరేట్లో మయూరాలు.. మంత్రముగ్ధులను చేసిన మయూరాల నాట్యం..
![కలెక్టరేట్లో మయూరాలు.. మంత్రముగ్ధులను చేసిన మయూరాల నాట్యం..](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644772ed13dc6.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతూ... ఎకో ఫ్రెండ్లీ గా తీర్చిదిద్దిన జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సందర్శకులనే కాక పక్షులను ఆకర్షిస్తుంది. సముదాయంలో పని చేసే ఉద్యోగులకు, వివిధ పనుల కోసం ఐడిఓసి కి వచ్చే సందర్శకులకూ పక్షుల కిలకిల రావాలతో స్వాగతం పలుకుతుంటాయి. కాగా మంగళవారం ఉదయం ఐడిఓసి ఆవరణలో జాతీయ పక్షి అయిన నెమలులు ప్రత్యక్షమైయ్యాయి. చాలా సేపు కార్యాలయ ఆవరణలోని లాన్ లో మయూరాలు అటూ ఇటూ తిరుగుతూ సందడి చేసాయి. ఇదే సమయంలో ఐడిఓసి కి వచ్చిన తెలంగాణ సాంస్కృతిక సారథి దొబ్బల ప్రకాష్ మయూరపు సోయగాలను తన మొబైల్ లో బంధించారు.
ఐడిఓసి లో మయూరపు సోయగాల వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన సోయగాలతో జాతీయ పక్షి నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
ఈ మధ్యే జగిత్యాల IDOC కి గోల్డెన్ గార్డెన్ అవార్డ్
ఇదిలా ఉండగా ఈ మధ్యనే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో ఈ నెల 15 న నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్- 2022లో జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC) గోల్డెన్ గార్డెన్ అవార్డ్ చేజిక్కించుకోవడం విశేషం.
జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC) లో పచ్చదనం పెంపొందించేందుకు అధికారుల తీసుకుంటున్న ప్రత్యేక చొరవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.