సహజీవన బంధాలను రిజిస్టర్ చేయాలంటూ పిటిషన్.. సుప్రీం ఆగ్రహం
![సహజీవన బంధాలను రిజిస్టర్ చేయాలంటూ పిటిషన్.. సుప్రీం ఆగ్రహం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641825bbda9ae.jpg)
సహజీవనాలపై దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ సంబంధాలను రిజిస్టర్ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అది తెలివి తక్కువ ఆలోచన అని పిటిషన్దారుపై మండిపడింది. కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ను తన సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్ పూనావాలా అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాణి అనే మహిళ సుప్రీంకోర్టు (Supreme Court)లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సహజీవన సంబంధాల్లో అత్యాచారాలు, హత్యల వంటి నేరాలు నానాటికీ పెరుగుతున్నాయని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి బంధాలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసేందుకు నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల సహజీవనంలో ఉండే వ్యక్తుల పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉండటంతో పాటు, అత్యాచార కేసులు కూడా తగ్గుతాయని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్తో సహజీవనం చేసేవారికి భద్రత కల్పించాలని చూస్తున్నారా? లేదా అలాంటి బంధంలోకి ఎవరూ వెళ్లొద్దని కోరుకుంటున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. ''సహజీవన బంధాలను నమోదు చేసుకుని కేంద్రం ఏం చేసుకుంటుంది? ఇది ఎంతటి తెలివితక్కువ ఆలోచన? ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ను మేం కొట్టేస్తున్నాం'' అని ధర్మాసం స్పష్టం చేసింది.