కేదార్​నాథ్​ యాత్ర నిలిపివేత!

కేదార్​నాథ్​ యాత్ర నిలిపివేత!

రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్‌ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు. హరిద్వార్‌లో గత 24 గంటల్లో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, డెహ్రాడూన్‌లో 33.2, ఉత్తరకాశిలో 27.7 మిల్లీమీటర్ల వర్షపాతత నమోదైనట్టు భారత వాతావారణ శాఖ తెలియజేసింది. పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండటం, మరిన్ని వర్షాలకు అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి ఆదేశాలిచ్చారు.

రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సెక్రటేరియట్‌లోని స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ కంట్రోల్ రూమ్‌ను ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. హరిద్వార్‌లో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఏరియాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని, సెన్సిటివ్ ప్రాంతాల్లో జేసీబీ మిషన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నదులు, డ్రెయిన్ల సమీపంలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తంగా చేయాలని సూచించారు. ఛార్‌థామ్‌లలో ఉన్న యాత్రికుల సంఖ్య, భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రుతుపవనాల కారణంగా రాబోయే ఐదారు రోజుల్లో భారీగా వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అప్రమత్తం చేసిందని, ఈ నేపథ్యంలో అధికారులతో తాను సమావేశమయ్యానని తెలిపారు. పరస్పరం సమన్యయంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఒకవేళ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే వస్తే తగినన్ని నైట్ షెల్టర్లు, సహాయ సామగ్రి ప్రతి జిల్లాల్లో అందుబాటులో ఉండేలా తగిన ఆదేశాలిచ్చామని చెప్పారు.