యోగాతో స్థిరమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాధించవచ్చు :జిల్లా కలెక్టరు పమేలా సత్పథి 

యోగాతో స్థిరమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాధించవచ్చు :జిల్లా కలెక్టరు పమేలా సత్పథి 

ముద్ర ప్రతినిధి భువనగిరి :యోగాతో స్థిరమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాధించవచ్చని జిల్లా కలెక్టరు పమేలా సత్పథి అన్నారు. బుధవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రపంచ యోగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరు ప్ర్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలన్నిటిని సంయోగపరిచి స్థిరమైన, సంతృప్తికరమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాధించడానికి యోగా దోహదం చేస్తున్నదని, ప్రతిరోజుజూ దైనందిక జీవితంలో అనేక సమస్యలతో సతమవుతున్న ప్రజలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికి 20 నుండి 30 నిమిషాలు యోగా చేయడం చాలా అవసరమన్నారు. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఒత్తిడి దూరం చేసుకోవడానికి 20 నుండి 30 నిముషాలు సీటు నుండి లేచి నడవడం, శరీర కదలికలు పాటించడం ద్వారా నొప్పులు, వత్తిడిని దూరం చెయ్యవచ్చని, యోగా కొన్ని రోజులు చేసి ఆపకూడదని, ప్రతి రోజు పాటిస్తేనే ఆరోగ్య ఫలితాలు పొందగలరని, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని అన్నారు.

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. మల్లికార్జున రావు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ యోగాను ప్రపంచ వ్యాప్తంగా పాటించేలా ప్రాచుర్యం చేశారని, ప్రాణాయామ ప్రక్రియలు మానసిక ఏకాగ్రత, ప్రశాంతత కలిగిస్తాయని, ఒత్తిడితో వచ్చే మధుమేహం, అస్తమా, రక్త పోటు, గుండె నొప్పి, నడుం, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి తోడ్పడతాయి అన్నారు. మన పురాతన కాలం నుండి ఎంతో ప్రాధాన్యత ఉన్న యోగాను మనందరం పాటించి జీవనశైలి వ్యాధులను దూరం చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా  ఏరియా ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ యం. యస్. చిన్నా నాయక్, డాక్టర్ వినోద్, డాక్టర్ అనిల్ రెడ్డి, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు డాక్టర్ శిల్పిని, డాక్టర్ యశోద, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్, యోగా శిక్షకులు డాక్టర్ గీత, డాక్టర్ రామకోటేశ్వరరావు  పాల్గొన్నారు.