తెలంగాణ ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించాలి
కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఏళ్ల తరబడి ఉద్యమించిన ఉద్యమకారులను స్వరాష్ట్ర సాధన సమరయోధులుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మలిదశ తెలంగాణ ఉద్యమకారులు అమరవీరులకు నివాళులర్పించి, ఏళ్ల తరబడిగా తాము ఉద్యమం లో కీలక పాత్ర పోషించి కేసులపాలై ఆర్థికంగా చిదిగిపోయామని ఇప్పటివరకు ప్రభుత్వం తమను ఆదుకోకపోవడం పట్ల విచారణ వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి తెలంగాణ ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులకు కల్పించిన విధంగా పింఛన్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు ఈనెల 10వ తేదీన కేసముద్రం మండల కేంద్రంలో ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని చాగంటి కిషన్, వెంకటయ్య, నరసింహారెడ్డి, బాల్మోహన్, వెంకన్న తదితరులు తెలిపారు.