ఈ సారి పోటీ పక్కా...

ఈ సారి పోటీ పక్కా...
ponguleti srinivas reddy

వచ్చే ఎన్నికల్లో పోటీపై ఖమ్మం బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బతికున్నంత కాలం టిక్కెట్‌ ఇవ్వకపోతే ఎలా, ఇక తాను వెయిట్‌ చేయలేనని, పోటీ చేయడం పక్కా అని తేల్చి చెప్పారు. న్యూ ఇయర్‌ సందర్భంగా ఆదివారం ఆత్మీయులతో సమావేశమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అంటూ స్పష్టంచేశారు. 2018లో నాకు ఎంపీ సీటు ఇవ్వలేదని పొంగులేటి వివరించారు. బతికున్నంత కాలం టిక్కెట్‌ ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఏదో ఒకటి ఇస్తామని ఇన్నాళ్లు చెప్పారు.. ఇక నేను వేచి ఉండలేను, పోటీ చేస్తా అంటూ పొంగులేటి తెలిపారు. ఎక్కడి నుంచి అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు.ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది చెప్పలేమన్నారు. పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని.. మూడు జనరల్‌ స్థానాలున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ స్థానం నుంచైనా పోటీ చేసే అవకాశముందని తెలిపారు. విూరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందని.. తన అభిమానులకు అంతా మంచే జరుగుతుందని తెలిపారు.మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సైతం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి.. పాలేరు నుంచి పోటీ చేస్తానని క్లారికటీ ఇచ్చారు. పాలేరు నుంచే పోటీ చేయడం ఖాయమని స్పష్టంచేశారు. పాలేరు ప్రజల పాదాలు కడిగి.. నా రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నానంటూ తుమ్మల అభిప్రాయపడ్డారు. ఇదే తన మనసులోని భావన అని తుమ్మల పేర్కొన్నారు. ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు. పాలేరు నియోజకవర్గంలోనే సొంత ఇంటిని కట్టిన తుమ్మల.. ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాలేరుతోపాటు.. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతో పని చేశానని తెలిపారు. 40 ఏళ్లలో ముగ్గురు సీఎంల పాలనలో మంత్రిగా పనిచేశానని పేర్కొన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీలోని కీలక నేతల వరుస సమ్మేళనాలతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్‌ స్థానాల్లో తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుండగా.. పొంగులేటి మాత్రం ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.