ప్రాణం తీసిన ఈత సరదా..

ప్రాణం తీసిన ఈత సరదా..
  • వాగులో మునిగి ఇద్దరు స్టూడెంట్స్ మృతి..
  • మొగుళ్లపల్లి మండలంలో విషాద ఛాయలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ఈతకు వెళ్లాలనే సరదా ఇద్దరు ప్రాణాలను బలిగొంది. 9వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా, అందులో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయి మృతి చెందారు. విషాదకరమైన ఈ సంఘటన మొగుళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఇస్సిపేటకు చెందిన ఐదుగురు, రంగాపురంకు చెందిన ఒకరు, మొగుళ్లపల్లికి చెందిన ఒకరు మొత్తం ఏడుగురు విద్యార్థులు సోమవారం పాఠశాలకు వెళ్లకుండా సరదాగా గడిపారు. మధ్యాహ్నం గ్రామ శివారులోని చలివాగుకు వెళ్లి సరదాగా ఈతకు దిగారు. అందులో మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బండారి అఖిల్(14), రంగాపురం గ్రామానికి చెందిన యు. హర్షవర్ధన్(14)లు వాగులో మునిగిపోయారు. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు భయాందోళనకు గురై విషయాన్ని దాచి ఉంచారు. చివరికి సాయంత్రం విద్యార్థుల నోట బయటికి వచ్చింది. ఆలస్యంగా విషయం బయటికి రావడంతో తెలుసుకున్న పోలీసులు రాత్రి సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒక మృతదేహం, మంగళవారం తెల్లవారుజామున మరొక మృతదేహం వాగులో లభ్యమయింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతితో మొగుళ్లపల్లి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది.