1534 కోట్లతో ఉమామహేశ్వర లిఫ్ట్

1534 కోట్లతో ఉమామహేశ్వర లిఫ్ట్
  • త్వరలో కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన
  • 2.5 డీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం
  • పరిపాలన అనుమతులు జారీ
  • ఫలించిన విప్ గువ్వల యత్నo..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. జిల్లాకు మరో ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు ప్రభుత్వం 1534 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పరిపాలన అనుమతులను బుధవారం రాత్రి జారీ చేసింది. నల్లమల్ల ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణం అత్యంత క్లిష్టంగా మారింది. ప్రజల ఆకాంక్షను పరిస్థితులను ప్రభుత్వ విప్ అచ్చంపేట గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన సీఎం రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. రెండు రోజుల కిందట అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములో భాగంగా స్టేజ్ వన్ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 2.5 టిఎంసిల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్  నిర్మించనున్నారు. అప్రోచ్, కెనాల్, కెనాల్ లింకింగ్, పంప్ హౌస్ ఇతర పనులు చేపట్టనున్నారు. కృష్ణా జలాల ఆధారంగా పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల పొడవైన కాల్వ ద్వారా లింగాల మండలం సూరారంలో నిర్వహించనున్న 2.5 టిఎంసిల సామర్థ్యం ఉన్న ఉమామహేశ్వర రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు. ఈ నీటిని బల్మూర్,కొండనాగుల, మైలారం గ్రామాల పరిధిలో నిర్మించే లిఫ్టుతో ఆయకట్టుకు ఎత్తిపోస్తారు. దీంతో అచ్చంపేట ఉప్పునుంతల, బల్మూరు మండలలోని 57,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇప్పటివరకు మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ( ఎం జీ కే ఎల్ ఐ) పరిధిలో అచ్చంపేటలో కేవలం 3000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నది. ఇక స్టేజ్ 2 పనుల్లో భాగంగా మున్ననూరు వద్ద నిర్మించనున్న ప్రతిపాదిత చెన్నకేశవ రిజర్వాయర్తో అమ్రాబాద్, పదరా కు సాగునీరు అందునున్నది. ఈ పనులకు త్వరలోనే పరిపాలన అనుమతులు రానున్నాయి. ఈ రిజర్వాయర్ పూర్తయితే మరో 20వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. రెండు లిఫ్టులు పూర్తయితే నియోజకవర్గంలో మొత్తం 70 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందనున్నది. లిఫ్ట్ రాను ఉండడంతో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు, రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.