ముద్ర, ప్రతినిధి వికారాబాద్: గొప్ప గొప్ప పనులు చేసే మనసున్న వ్యక్తులపై అభిమానం పెంచుకున్న కొందరు యువకులు పాదయాత్ర చేస్తూ వారి వద్దకు వెళ్లడం చూశాం. కానీ ఓ యువకుడు ఏకంగా అదే పార్టీ అధికారంలోకి రావాలని పాదయాత్ర చేపట్టాడు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన యువకుడు పాదయాత్ర చేపట్టాడు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన ఉడుము లక్ష్మణ్ అనే యువకుడు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు వీరాభిమాని అట. దీంతో పార్టీతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై ప్రత్యేక అభిమానాన్ని చాటేందుకు చేతిలో పోస్టర్ పట్టుకొని ముందుకు కదిలాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకున్నదని పేర్కొంటున్నాడు. వారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై అభిమానిగా మారిపోయానని అంటున్నాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి ఇతర రాష్ర్టాలు తెలుసుకోవాలని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నానని లక్ష్మణ్ పేర్కొన్నాడు. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలువనున్నటు చెప్పారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. వికారాబాద్ మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్రను సాగించనున్నాడు.