భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కీలక నిర్ణయం

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కీలక నిర్ణయం

రోజురోజుకీ పెట్రోల్‌, డీజీల్ ధరలు పెరుగుతుండడంతో ఎలక్ట్రానిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కంపెనీలు సైతం ఈవీ వెహికిల్స్‌ తయారీలోకి దిగుతున్నాయి. అలాగే ప్రభుత్వాలు సైతం సబ్సిడీలు ప్రకటిస్తుండడంతో ఈవీ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ ఛార్జింగ్ పాయింట్స్‌కి భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  కొత్తగా 19 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేల వెంబడి శుక్రవారం ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతీ 100 కిలోమీటర్లకు ఒక ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

బీపీసీఎల్‌ దక్షిణాది రిటైల్ హెడ్ పుష్ప్ కుమార్ నాయర్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈవీని 30 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే కనీసం 125 కిలోమీటర్ల దూరం వెళ్ళేలా రూపొందించాం. అందుకే ప్రతి 100 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.  ప్రస్తుతం 500 ఈవీ పాయింట్స్‌ అందుబాటులో ఉండగా రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 7000 ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు బీపీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్) పిఎస్‌రవి తెలిపారు. దీనికి సుమారు రూ. 750 నుంచి 800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. హైవే కారిడార్‌లో అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఏకైక చమురు ప్రధాన సంస్థ బీపీసీఎల్‌ అని ఆయన అన్నారు. పెట్రోల్‌తో నడిచే కారుకు ఇంధనం నింపడం కంటే ఈవీతో 35-40 శాతం చౌకగా ఉంటుందని చెప్పారు.