వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ  

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ  

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నారా.. లేరా.. అనే సందేహం వస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు హాజరైన బండి సంజయ్‌.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

''వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలి.  బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యం అయింది.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చుకుందని రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నారు. ఒక కార్పొరేటర్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని కేటీఆర్ విమర్శిస్తున్నారు. కేటీఆర్‌కు ట్విటర్ టిల్లు అని నామకరణం చేస్తే బాగుంటుంది. సీఎం కేసీఆర్‌కు సీబీఐ, పోలీసుల కంటే మహిళా మోర్చా అంటే భయం. తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా చేశారు. హత్యలు, అత్యాచారాలకు ప్రధాన కారణం మద్యం. రాష్ట్రంలో మద్యం వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది'' అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.