భారత గగనతలం పైనా నిఘా బెలూన్?
![భారత గగనతలం పైనా నిఘా బెలూన్?](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f9f34eac036.jpg)
దిల్లీ: అమెరికా గగనతలంపై చైనా బెలూన్ల వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, గతేడాది భారత్లోని అండమాన్ నికోబార్ దీవుల పైనా ఆకాశంలో ఒక పెద్ద బెలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే, ఆ సమయంలో అదేంటో ఎవరికీ తెలియరాలేదు. ఇటీవల చైనా బెలూన్ను అమెరికా కూల్చివేసిన పరిణామాల నేపథ్యంలో.. దేశ రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. ఆ అసాధారణ వస్తువు కనిపించిన ద్వీపాలు.. భారత్ క్షిపణి పరీక్షా కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయి. చైనా తదితర దేశాలకు ఇంధనం, ఇతర సామగ్రి జల రవాణాకు కీలకమైన మలక్కా జలసంధీ వాటికి సమీపంలోనే ఉంటుంది. అండమాన్ నికోబార్ ద్వీపాలపై ఆ వస్తువు అకస్మాత్తుగా ప్రత్యక్షమైందని, మధ్యలో అనేక భారత రాడార్ వ్యవస్థలను తప్పించుకుందని పలువురు అధికారులు చెప్పినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది.