అమిత్ షా రాజీనామా చేయాలి

అమిత్ షా రాజీనామా చేయాలి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్  తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : మణిపూర్ రాష్ట్రంలో మైతిలు, కుకిలు, నాగాల జాతుల మధ్య ఘర్షణలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తో పాటు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ లు ఘోరంగా వైఫల్యం చెందాయి అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి అన్నారు. మణిపూర్ లో జరిగిన అల్లర్లలో కట్టడి చేయడంలో వైపల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, మే నెల నుంచి ఆ రెండు తెగల మధ్య మణిపూర్ లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయన్నారు.

చుట్టూ ఉన్న కొండ ప్రాంతంలో కుకీలు, నాగాలు జాతులు నివసిస్తూ ఉంటాయని తెలిపారు. వీరి జనాభా 30 నుంచి 40% వరకు ఉంటుందని, వీరు కొండ ప్రాంతంలో ఉండడం మూలంగా వీరు ఎస్టీ జాబితాలో ఉన్నారని తెలిపారు. ఇది ఇలా ఉండగా మైతీలు కూడా వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని అడుగుతున్నారు. ఇక్కడ ఎప్పుడు మైతీళ్లకు సంబంధించిన వారి ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే మైతి లను ఎస్టీలుగా గుర్తిస్తే మాకు అన్యాయం జరుగుతుందని కుకిలు నాగాలు ఆందోళన చెందుతున్నారన్నారు.  మణిపూర్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పెట్టిన చట్టం వల్ల సైన్యం కూడా చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని అన్నారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు కె తేజ్ దీప్ రెడ్డి, చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ పెద్దెల్లి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.