అన్నసాగర్ సర్పంచ్ సస్పెన్షన్
మహబూబ్ నగర్ ముద్ర ప్రతినిధి: గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను భూత్ పూర్ మండలం అన్నాసాగర్ గ్రామపంచాయతీ సర్పంచు ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక అన్నా సాగర్ పూర్వపు గ్రామపంచాయతీ కార్యదర్శి ,ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని కూడా సస్పెండ్ చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అన్నా సాగర్ గ్రామ సర్పంచ్ కె. నీలిమ గ్రామపంచాయతీకి సంబంధించి వివిధ పద్దుల కింద సుమారు 14 లక్షల 66 వేల రూపాయలను దుర్వినియోగం చేశారని, అందువలన ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నిధుల దుర్వినియోగంలో అప్పుడు పంచాయతీ కార్యదర్శి గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్న దృష్ట్యా శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సిఫారసు చేసినట్లు ఆయన తెలిపారు.గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.