మరో  గొప్ప పథకం బీసీ బంధు !

మరో  గొప్ప పథకం బీసీ బంధు !
  • రాష్ట్రంలో 14 బీసీ కులాలు ఆర్థికంగా అభివృద్ధి
  •  చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ బంధు కూడా ఒక గొప్ప పథకమని రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దీని వల్ల రాష్ట్రంలో 14 బీసీ కులాల అభివృద్ధికి ఆర్ధికంగా దోహదపడుతుందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అంబేద్కర్ భవన్ లో  బీసీ సంక్షేమ శాఖ నిర్వహించిన  కుల వృత్తుల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో నేడు బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ప్రధానంగా కుల వృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ బంధు పథకం మరింత ఉపయోగపడుతుందన్నారు. దీని కింద అర్హులైన వారికి లక్ష రూపాయల గ్రాంట్ ఇవ్వడం అన్నది అద్భుతమన్నారు.  దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. వృత్తిని నమ్ముకుని ఆధారపడ్డ కులాలకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యమన్నారు. గతంలో కూడా బీసీలకు ఆర్థిక సాయం ఇచ్చేవారు...కానీ  అది అప్పుగా ఇచ్చేవారన్నారు. దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.

 ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా లక్ష రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నదన్నారు. కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో  నాయి బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. అలాగే నేతన్నలకు 50 శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసే చేనేత మిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. మత్స్యకారుల కోసం నీటి వనరులలో  ఉచిత చేప పిల్లలు పంపిణీ కోసం రూ. 600 కోట్ల తో మత్స్యకారులకు లూనాలు, మోపెడ్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు..

బీసీ కులాల్లో అన్ని కుల వృత్తులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ముదిరాజు, బెస్త, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ్, యాదవ సోదరులు ఇలా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించారన్నారు. గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆయా వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నదన్నారు.తెలంగాణకు పూర్వం కేవలం 19  బీసీ గురుకులాల్లో 7,580 విద్యార్థులు ఉంటే, నేడు 310 బీసీ గురుకులాల్లో  1,81,880 విద్యార్ధులు ఉన్నారన్నారు.గత పాలకులకు రాని ఆలోచన, గత పాలకులు చేయని సంక్షేమాన్ని కేసీఆర్ చేసి చూపిస్తున్నారని వినయ్ భాస్కర్ అన్నారు. అలాగే తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మొత్తం 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా ప్రస్తుతం 1012 ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి ఒక్క మండలంలో ఒక బీసీ, ఒక ఎస్సీ, ప్రతి నియోజకవర్గానికి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్,అడిషనల్ కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ రమేష్, జీడబ్లూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, బీసీ వెల్ఫేర్ డిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు , రైతు సమితి కోఆర్డినేటర్లు, వెనుకబడిన తరగతుల  శాఖ అధికారులు పాల్గొన్నారు.