రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడం షాక్ కు గురి చేసింది
![రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడం షాక్ కు గురి చేసింది](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641c0bfb1c80f.jpg)
రాహుల్ గాంధీకి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం షాక్ కు గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరువు నష్టం కేసులు వేసి రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని అన్నారు. టీఎస్పీఎస్సి లో జరిగిన పేపర్ లీక్ ల కుంభకోణంలో నేను సాక్షి గా వెళుతున్న సమయంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను, హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. కేసీఆర్ ఖమ్మం, మహబూబా బాద్ జిల్లాలలో పర్యటించి పాడైన పంటలను పరిశీలించేందుకు వెళ్తుంటే ఆయా జిల్లాల నాయకులను అరెస్టులు చేశారన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేకుండా పాలన సాగుతున్న బీజేపీ, బీఆర్ ఎస్ లపై తిరగబడక తప్పదన్నారు. రాహుల్ గాంధీ 2019 పార్లమెంట్ ఎన్నికల సభలో చేసిన ఒక రాజకీయ ప్రకటన ను ఆసరా చేసుకొని మోడీ ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం దావా వేసి కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి దేశం కోసం బ్రిటిష్ వారి పైన పోరాటం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిన కుటుంబం ఈ మోడీ లకు భయపడదన్నారు.