తెలంగాణ పోలీసులను దేశంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దే
![తెలంగాణ పోలీసులను దేశంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దే](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647cba1f56427.jpg)
మహిళా సురక్షా సంబరాలలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
ముద్ర, ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని షీటీమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్పై మహిళా సురక్షా సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉమెన్ సేఫ్టీవింగ్, షీటీమ్స్ ఇన్చార్జీ షికాగోయల్, హీరో నాని, క్రీడాకారిని నైనాజైస్వాల్ లు హాజరయ్యారు. తెలంగాణ పోలీస్విమెన్ సేఫ్టీవింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను అతిథులతో కలసి కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ నంబర్వన్ స్థానంలో ఉన్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ను మన దగ్గర సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. గతంలో మహిళలు అర్థరాత్రి రోడ్లపై తిరగాలంటే భయపడేవారని, ఇప్పుడా భయంలేదని నిర్భయంగా తిరుగుతున్నారని చెప్పారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించి పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, దీంతో నేరాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పారు. డీజీపీ అంజనీకుమార్తో పాటు ముగ్గురు కమిషనర్లు చాలా చక్కడా లా అండ్ ఆర్డర్ కొనసాగిస్తున్నారని ప్రశంశించారు.
సీఎం కేసీఆర్ పోలీస్ శాఖపై ప్రత్యేక శ్రద్ద చూపడంతో పాటు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చాని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే తెలంగాణ పోలీస్ నంబర్వన్ స్థానంలో ఉండబోతుందని చెప్పారు. మహిళల కోసం షీటీమ్స్, భరోసా కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ దశాబ్ధి ఉత్సవాలో రెండవరోజు పోలీసు ఉత్సవాలు నిర్వహించుకోవడం అంటే ముఖ్యమంత్రికి పోలీసుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల ఎలాంటి చర్యలు చేపడుతుందో కళ్లకు కట్టినట్లు ఈ కార్యక్రమం ద్వారా వివరించడం శుభపరిణామమన్నారు. భారత దేశానికి ఆదర్శంగా మన పోలీసు వ్యవస్థ ఉండటం మనకు గర్వకారనమన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మహిళా భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలిగిస్తుందన్నారు.
ఆడపడుచుల సంక్షేమం, భద్రతపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద వహించి షీటీమ్స్, భరోసా తదితర కార్యక్రమాలను తీసుకువచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే రౌడీరాజ్యం నక్సలైట్ల రాజ్యం అవుతుందని అపోహలు ఉండేవవన్నారు. నాటి డీజీపీ అనురాగ్ శర్మ, మహేందర్రెడ్డి, ఇప్పుడు డీజీపీ అంజనీకుమార్ వరకు ఒక్క రోజు కర్ఫూలేకుండా, కమ్యూనల్ రైడ్ లేకుండా రికార్డు పరిపాలన సాగిస్తున్నారు. ఎవరినీ ఎక్కడ వేధించకుండా చాలా చక్కటి లాఅండ్ ఆర్డర్ అందిస్తున్నారు మహిళలకు భద్రత ఇస్తున్నారు కాబట్టే మనకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికం తరపున పోలీసులకు వందనాలు తెలియజేశారు. ఇక్కడ మనకు కనబడుతున్న పోలీసులు మూడు సింహాలైతే మనకు కనబడకుండా వారి వెనుక ఉండి నడిపించే నాలుగో సింహం కేసీఆర్అన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి, సినీ హీరో నాని, క్రీడాకారిని నైనా జైస్వాల్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హోంసెక్రటరీ మహేష్ భగవత్, పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.