ప్రతి మిల్లు వద్ద పోలీసులను పెట్టి అన్ లోడింగ్ చేయించండి
![ప్రతి మిల్లు వద్ద పోలీసులను పెట్టి అన్ లోడింగ్ చేయించండి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6470a523dc4b8.jpg)
- ప్రతి మిల్లు వద్ద పోలీసులను పెట్టి అన్ లోడింగ్ చేయించండి
- మరింత వేగంగా ధాన్యం కొనుగోలు కలెక్టర్ రాజర్షి షా
ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రతి మిల్లు వద్ద పోలీసులను పెట్టి త్వరగా అన్ లోడింగ్ జరిగేలా అధికారులు మానిటరింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల పక్రియ మరింత వేగవంతం చేసి జూన్ 2 నాటికి పూర్తయ్యేలా చూడాలని మండల ప్రత్యేక అధికారులు, ఆర్.డి.ఓ.లు, తహసీల్ధార్లు, డిఎస్పీలకు సూచించారు. శుక్రవారం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... మిల్లుల వద్ద హమాలీలలను అధిక సంఖ్యలో పెట్టుకొని ధాన్యం ఆన్ లోడింగ్ త్వరితగతిన అయ్యేలా తహసీల్ధార్లు, డిప్యూటీ తహసీల్ధార్లు, గిర్దావర్లు మిల్లుల వద్ద ఉండి పర్యవేక్షిస్తూ మిల్లర్లను పురమాయించాలని సూచించారు. ఆన్ లోడింగ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా తిరిగి కొనుగోలు కేంద్రాలకు లారీలు తరలించి లోడింగ్ చేసి పంపుటకు వీలవుతుందన్నారు. కేంద్రం నిర్వాహకులు కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం అయిన వెంటనే లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలన్నారు.
మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా తక్షణమే దించుకొని ట్రక్ షీట్ ఇచ్చేలా నిరంతరం పర్యవేక్షిస్తూ మండల వారీగా, మిల్లు వారీగా రోజు వారి లోడింగ్, ఆన్ లోడింగ్ నివేదిక అందజేయవలసినదిగా జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా మిల్లర్లు ధాన్యం దించుకోవడంలో అలసత్వం వహిస్తే నోటీసులు జారీ చేయాలని హెచ్చరించారు. గత సీజనుతో పోలిస్తే ధాన్యం సేకరణ అధికంగా ఉన్న అక్కడక్కడా రైతులు ధర్నాకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, అటువంటి సునిశిత కేంద్రాలను గుర్తించి అనవసరంగా ధర్నాలు, సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసుల సహకారంతో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా రెవెన్యూ అధికారులకు సూచించారు. ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రం నిర్వాహకులు తూకం వేసి గన్ని బ్యాగులో ధాన్యం నింపి రెడీగా పెట్టుకోవాలని, లారీలు వచ్చిన వెంటనే లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలన్నారు. అధికారులు కూడా గన్ని సంచుల కొరత లేకుండా, లారీల సమస్య తలెత్తకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తూ ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రాలకు త్వరగా లారీలను పంపాలని అన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రమేష్, డీఎస్ఓ శ్రీనివాస్, కేంద్రం నిర్వాహకులు తదితరులున్నారు.