కుంభం ట్రస్టు ఆధ్వర్యంలో పాఠశాలలలో డిజిటల్ తరగతి గదులు

కుంభం ట్రస్టు ఆధ్వర్యంలో పాఠశాలలలో డిజిటల్ తరగతి గదులు

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె కుంభం కీర్తి రెడ్డి బీబీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణను డెమోను శుక్రవారం పరిశీలించారు. త్వరలో ఆమె ప్రారంభించనున్న ట్రస్ట్ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గంలోని పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. సీడ్స్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ తరఫున ఏర్పాటు చేస్తున్న ఈ డిజిటల్ తరగతి గదుల డెమోను ఆమె స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కాస్సేపు ముచ్చటించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఆయా సమస్యలను ఎలా పరిష్కరించడానికి వీలవుతుందన్న విషయాన్ని సీడ్స్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో చర్చించారు. ఆయా సమస్యలను తాము స్వయంగా పరిష్కరిస్తామని ఆమె విద్యార్థులు, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. పిల్లలతో కలిసి ఆమె డిజిటల్ తరగతి డెమోలో పాల్గొని, అది విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడుతుందన్న దానితో పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.