జాతీయ రహదారి నిర్మాణానికి భూ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి...

జాతీయ రహదారి నిర్మాణానికి భూ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి...
  • మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ ప్రతిపాదనలు రూపొందించాలి
  • భూ సేకరణ ప్రతిపాదనల రూపకల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: వరంగల్ -మంచిర్యాల మధ్య 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టుటకు భూ సర్వే నిర్వహించి శనివారం లోగా సంబంధిత నివేదికలుసమర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి భూ సేకరణ సర్వే  ప్రతిపాదనల రూపకల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్-మంచిర్యాల మధ్య 4 వరుసల గ్రీన్ కారిడార్ జాతీయ రహదారి కోసం పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లో అవసరమైన భూ సేకరణ చేపట్టుటకు సర్వే చేసి ప్రతిపాదనలను తయారు చేయాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ,  మిషన్ భగీరథ  ఇంట్రా, ఉద్యానవన శాఖ అధికారులు జాతీయ రహదారి నిర్మించడం వల్ల ఆయా శాఖల పరిధిలో కలిగే నష్టాలకు, వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, అదే విధంగా సేకరించాల్సిన భూమి , రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, తదితర అంశాలపై సంపూర్ణ నివేదిక రూపొందించాలని అన్నారు. 

జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణకు సంబంధించి భూ సర్వేను అధికారులు కట్టుదిట్టంగా పూర్తి చేయాలని, భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు తప్పనిసరిగా నష్టపరిహారం అందుతుందని, ప్రభుత్వం ప్రకటించే పరిహారం పట్ల రైతులకు సంతృప్తి కలగని నేపథ్యంలో వారు అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని, రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తూ భూ సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్.,ఆర్.అండ్ బి., సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.