'ముద్ర ' కథనం కు స్పందన...
- ఓడేడు మానేరులో వసూలు రాజాలకు చెక్..!...
- కదలిన అధికార యంత్రాంగం...
- మానేరులో అక్రమంగా పోసిన రోడ్డు ను ధ్వంసం చేసిన అధికారులు...
ముద్ర, పెద్దపల్లి, ప్రతినిధి: మానేరులో వసూలు రాజాలకు అధికారులు మంగళవారం చెక్ పెట్టారు. గత మూడు నెలలుగా కొంతమంది మానేరు నదిలో మట్టి పోసి రోడ్డు వేశారు. అక్రమంగా రోడ్డు వేసుడే కాకుండా అక్కడ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, వాహనదారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
దీంతో వారి బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతుంది, దాదాపు రోజుకు ఒక లక్ష రూపాయలపైనే డబ్బు వస్సుల రాజాలు వసూలు చేస్తుండడంతో ఆగ్రహించిన ప్రయాణికులు, వాహనాదారులు, మండల ప్రజలు మీడియాకు తెలుపడంతో ముద్ర పేపర్ లో సోమవారం"వసుల్ల దందాకు కొత్త రూటు" అనే వార్త ప్రచురితం కావడంతో స్పందించిన ముత్తారం మండల తాసిల్దార్ సుమన్, ఎంపీడీవో లలిత, ఎస్సై మధుసూధన్ రావు, ఐబీ జెఈ రఫీ మంగళవారం ఓడేడు మానేరు ను సందర్శించి అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేశారు. జెసిబి ని తీసుకొచ్చి అక్రమంగా వేసిన రోడ్డును తవ్వించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూనే ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరైనా అక్రమ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా మానేరులో మట్టి పోసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో పాటు తమకు ఫిర్యాదులు కూడా అందాయని, దీంతో ఉన్నతాధికారుల సూచనలతో రోడ్డును ధ్వంసం చేశామన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా మట్టి పోసి ప్రయాణికుల దగ్గర డబ్బులు వసూలు చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధుసధన్ రావు, ఆర్ఐ భవాని, ఐబీ జెఈ రఫీ, పంచాయతీ కార్యదర్శి స్వప్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.