వేధింపులు భరించలేకనే హత్య..
![వేధింపులు భరించలేకనే హత్య..](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_6519510b861cf.jpg)
- కొడుకును చంపిన తండ్రి కి రిమాండ్...
- ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి
ముద్ర, గంభీరావుపేట : కొడుకును చంపిన తండ్రిని అరెస్టు చేసి,రిమాండ్ కు తరలించినట్టు ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన కుంట రమేష్ ఒకప్పుడు విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేశాడు. మద్యానికి బానిస కావడంతో రమేష్ ను ఉద్యోగం నుండి తొలగించారని అన్నారు . దీంతో మరింతగా మద్యానికి బానిసైనా రమేష్ అప్పుడప్పుడు కులవృత్తిలో భాగంగా చేపల వేటకు వెళ్లి,వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ తండ్రి సాయిలు, అందురాలైన తల్లి మల్లమ్మ, అంగవైకల్యంతో బాధపడుతున్న సోదరుడు సత్యనారాయణ ను గత కొంతకాలంగా డబ్బుల కోసం వేధించేవాడని, వారి పెన్షన్ డబ్బులు కూడా బలవంతంగా రమేష్ తీసుకునేవాడని పేర్కొన్నారు. కొడుకు రమేష్ వేధింపులు భరించలేక తండ్రి సాయిలు విసిగిపోయి,శనివారం ఉదయం నిద్రలో ఉన్న రమేష్ తల పై గొడ్డలితో సాయిలు దాడి చేయడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకును హత్య చేసిన తండ్రి సాయిలు ను ఆదివారం లింగాపూర్ బస్టాండ్ లో అరెస్టు చేసి,రిమాండ్ కు తరలించినట్టు సీఐ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో గంభీరావుపేట ఎస్సై మహేష్ పాల్గొన్నారు.