యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు ఫడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు

యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు ఫడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు
  • నైవేద్యం, అన్నప్రసాదాలు అత్యంత నాణ్యమైనవిగా సర్టిఫికేట్
  • శుచి, శుభ్రతకు మారు పేరు అని వెల్లడి
  • ‘భోగ్’ గుర్తింపు పొందిన అతి తక్కువ దేవాలయాల్లో చోటు
  • హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

 భువనగిరి ముద్ర న్యూస్ : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ ఎస్ స్ ఏ ఐ) జాతీయ సర్టిఫికేట్ ‘భోగ్’ - బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ గుర్తింపు లభించింది. దేశంలో 70పైగా దేవాలయాలు ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రాష్ట్రంలోని రెండు దేవాలయాలకు ఈ గుర్తింపు లభించింది. దేశంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని వంటి ప్రముఖ దేవాలయాలకు మాత్రమే ఇప్పటి వరకు ఈ గుర్తింపు రాగా, తెలంగాణలో రెండు దేవాలయాలకు రావడం విశేషం.

కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం, యాదాద్రి, వర్గల్ దేవాయాలు సందర్శించి, నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, కిచెన్ నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలపై పరిశీలన చేసింది. ఫుడ్ సేఫ్టీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న కేంద్ర బృందం భోగ్ గుర్తింపుకు రిఫర్ చేసింది. భోగ్ సర్టిఫికేట్ సాధించేందుకు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం ఎంతో కృషి చేసింది. ప్రోగ్రాం ప్రత్యేక నోడల్ అధికారిణిగా అడిషనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలోని బృందం యాదాద్రి, వర్గల్ దేవాలయాల్లో నైవేద్యం, అన్న ప్రసాదాలు తయారు చేసే క్రమంలో అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాల గురించి అవగాహన కల్పించారు. శుభ్రత విషయంలో పాటించాల్సిన పద్ధతులు వివరించారు. దీంతో కేంద్ర బృందం జరిపిన ఫైనల్ ఆడిట్ అనంతరం రాష్ట్రంలోని రెండు దేవస్థానాలకు మొట్ట మొదటి సారిగా భోగ్ గుర్తింపు లభించింది.

జాతీయ స్థాయి ఆహార నాణ్యత గుర్తింపు లభించడం గొప్ప విషయం: ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో తొలిసారిగా యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు భోగ్ గుర్తింపు లభించడం సంతోషించదగ్గ విషయం. ఇందుకు కృషి చేసిన ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు శుభాకాంక్షలు. తెలంగాణలోని అన్ని దేవాలయాలకు ఈ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి. సీఎం కేసీఆర్  రాష్ట్రంలో అన్ని దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వారికి అత్యంత నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడం ఎంతో ముఖ్యం.