రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలే: ఈటెల రాజేందర్
![రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలే: ఈటెల రాజేందర్](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_648b28666b7ac.jpg)
రాయగిరిలో రైతులను పరామర్శించిన ఈటెల
ముద్ర ప్రతినిధి భువనగిరి: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదని రైతులకు సంకెళ్లు వేయడం కెసిఆర్ నియంత పాలనకు నిదర్శనమని బిజెపి రాష్ట్ర చేరికర సంఘం చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం రాయగిరిలో త్రిబుల్ ఆర్ పోరాటంలో అరెస్టు అయి విడుదలైన రైతులను ఆయన కలసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయగిరి రైతులు ఇప్పటికే వందల ఎకరాలు భూమి కోల్పోయారని అన్నారు. తమభూమి తమకు కావాలని పోరాటం చేస్తే ఖైదీల వలే సంకెళ్లు వేస్తారా అని ప్రశ్నించారు.
వెంటనే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. రైతులందరూ కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యల్లో బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి కుటుంబాల్లో మద్యం చిచ్చు పెడుతున్నారన్నారని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెబుతూ రైతుల దగ్గర వందల ఎకరాల భూములు లాక్కుంటున్నారని చెప్పారు. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం ఆగదు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్రనాయకులు గూడూరు నారాయణ రెడ్డి, నాయకులు జగన్మోహన్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, మాయ దశరథ పాల్గొన్నారు.