కాంగ్రెస్ లో గ్రూపులే బలం.. బలహీనత: మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
ముద్ర ప్రతినిధి, మెదక్: గ్రూపులు కాంగ్రెస్ కు కొత్త కాదని చివరికి ఐకమత్యంగా సాగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బలము, బలహీనత కాంగ్రెసులో ఉన్న గ్రూపులే అన్నారు. మారుతున్న రాజకీయాల పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా పలు మార్పులు చేస్తుందని, పార్టీలో నేను అని ఆలోచించకుండా మనము అని అందరూ ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజావ్యతిరేకత ఓట్లతో పాటు ఐక్యతతో కాంగ్రెస్ పార్టీ చరిత్ర, పని తీరు తెలిపి ఓటు బ్యాంకుతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి కావలసి ఉందని, కాంగ్రెస్ కు ఉన్న క్యాడర్ బిజెపికి లేదు, కాంగ్రెస్ పార్టీ మంచి ఓటు బ్యాంకు కలిగి ఉందని, పార్టీలో ఐక్యత చాటి వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తామని దామోదర్ రాజనర్సింహ అన్నారు.