రాహుల్-ఉద్ధవ్ మధ్య 'సావర్కర్ వివాదం' సద్దుమణిగిందా..?
![రాహుల్-ఉద్ధవ్ మధ్య 'సావర్కర్ వివాదం' సద్దుమణిగిందా..?](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6422e6893b3d3.jpg)
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య హిందూ సిద్ధాంత కర్త సావర్కర్ అంశం అగ్గి రాజేసింది. 'మా దేవుడైన సావర్కర్ను అవమానిస్తే ఊరుకోం' అంటూ మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. అయితే ఇప్పుడు సావర్కర్ విషయంలో వచ్చిన అభిప్రాయభేదం తొలగిపోయినట్లు తెలుస్తోంది. 'మేం రాహుల్ గాంధీతో మాట్లాడాం. మా పోరాటం మోదీతో.. సావర్కర్తో కాదు' అని ఉద్ధవ్ వర్గం శివసేన నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. దీనిపై రాహుల్.. ఉద్ధవ్కు ఫోన్ చేశారని చెప్పారు.
'నిన్న సమావేశంలో మంచి విషయాలు చర్చించుకున్నాం. మా బంధం మెరుగ్గా ఉంటుంది' అని సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సావర్కర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తమ కూటమికి చీలిక తెస్తుందని వ్యాఖ్యానిస్తూ.. ఉద్ధవ్ ఠాక్రే ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇదిలా ఉంటే..ఈ సమావేశానికి హాజరైన 17 ప్రతిపక్షపార్టీలు సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ఇందులో నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు.