జనగామ టికెట్ బీసీలకే ఇవ్వాలి
![జనగామ టికెట్ బీసీలకే ఇవ్వాలి](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64edd60c743f6.jpg)
- ఉద్యమం నుంచి కేసీఆర్తో కలిసి పనిచేసిన
- అప్పట్లో పాలకుర్తి టికెట్ ఇచ్చి రద్దు చేశారు
- ఈసారైనా ఉద్యమ నేతగా నన్ను గుర్తించాలి
- బీఆర్ఎస్ నేత జల్లి సిద్ధయ్య
ముద్ర ప్రతినిధి, జనగామ:జనగామ అసెంబ్లీ టికెట్ను బీసీలకే ఇవ్వాలని టీఆర్ఎస్ నేత, మద్దూరు మాజీ జడ్పీటీసీ జల్లి సిద్ధయ్య కోరారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామ నియోజవర్గంలో కొన్నేళ్లుగా స్థానికేతరులే రాజ్యమేలుతున్నారన్నారు. ఈసారి స్థానికులకు అవకాశం ఇవ్వాలని సీఎం కోరుతున్నట్టు పేర్కొన్నారు. తాను ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్తో కలిసి పనిచేశానని, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎంతో సేవ చేశానని తెలిపారు. గతంలో తనకు మద్దూరు జడ్పీటీసీగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. నియోజకవర్గ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి గతంలో కేసీఆర్ పాలకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, కానీ చివరి నిమిషమంలో పార్టీ అవసరాల మార్చారని వివరించారు. ఆనాడు కేసీఆర్ తనకు ఎదైనా పదవి ఇస్తానని మాటిచ్చారన్నారు. ప్రస్తుతం హోల్డ్లో పెట్టిన జనగామ నియోజకవర్గం నుంచి ఉద్యమ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతల చెన్నయ్య, జేఏసీ అధ్యక్షుడు పానుగంటి శ్రీనివాస్, పైస లింగం, పూసల సంఘం నాయకులు పగిడిపల్లి శ్రీనివాస్, పానుగంటి వెంకటరమణ, గోల్డ్ స్మిత్ అధ్యక్షుడు ఆకోజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.