తెలంగాణలో అతిపెద్ద దోపిడీదారుడు కేసీఆర్

తెలంగాణలో అతిపెద్ద దోపిడీదారుడు కేసీఆర్
  • కాళేశ్వరం తో ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలే
  • హరీష్ రావు ది భజన శాఖ
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి కరీంనగర్, పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దోపిడీదారుడు కేసీఆర్ అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. బట్టి చేపట్టిన పాదయాత్ర  32వ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆకేనపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖలను వదిలిపెట్టి భజన శాఖ నిర్వహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అభయ హస్తం పథకం అటకెక్కించినందుకా ? ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం తొలగించినందుకా?  డ్వాక్రా సంఘాల పిల్లలకి స్కాలర్షిప్ పథకాన్ని తీసివేసినందుకా? వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా మహిళలను మోసం చేసినందుకా? ఎందుకు కేసీఆర్ రుణం డ్వాక్రా మహిళలు తీర్చుకోవాలి హరీష్ రావు అంటూ  మండిపడ్డారు. ఆసుపత్రుల్లో వీల్ చైర్లు లేకుండా రోగులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోడు కానీ కెసిఆర్ కు భజన చేసే కార్యక్రమాలు చేయడానికి మాత్రం ముందుంటున్నాడని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించినందుకా?  దళిత బంధు 17, 700 కోట్లు కేటాయించి ఏడాది పూర్తి అయిన రిలీజ్ చేయనందుకా మీకు అధికారం వెలగబెట్టింది అని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల రెండు లక్షల ఎకరాలు తెలంగాణలో ముంపునకు గురవుతున్న పట్టించుకోని ఈ ప్రభుత్వం ప్రాణహిత కడితే ఎగువన 3 వేల ఎకరాలు ముంపు అవుతుందని ప్రాజెక్టును రీడిజైన్ చేయడం అవివేకమని మండిపడ్డారు. 1.25  లక్షల కోట్లతో కాళేశ్వరం కట్టామని టిఆర్ఎస్ పాలకులు గొప్పలు చెప్పడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్లు లక్ష్మీ కాలువ, సరస్వతి కాలువ కాకతీయ కాలువలో పారించి కాలేశ్వరం నీళ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ ల నుంచి ఒక ఎకరానికైనా అదనంగా సాగునీరు ఇచ్చారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి ఇదే రోల్ మోడల్ అంటూ ప్రచారం చేసుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ దేశంలో ఇదే మాదిరిగా సంపదను దోపిడీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని విమర్శించారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే దేశంలో ఉన్న విపక్ష పార్లమెంటు అభ్యర్థులకు ఎన్నికల కయ్యే ఖర్చు తానే భరిస్తానని కేసీఆర్ చెప్పడం ఈ రాష్ట్ర సంపద ఎంత దోపిడీ చేశాడో అర్థమవుతుందన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయ చదరంగం ఆడుతుంటే చూడడానికి తెలంగాణ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండవని ప్రకటించిన కేసీఆర్ రామగుండం నగరం నడిబొడ్డున ఓపెన్ కాస్ట్ మైనింగ్లు తెరిచి చిన్నపాటి భూకంపాలకు కారణమయ్యాడని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడం ఈ ప్రాంతానికి శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించాల్సిన ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను కొల్లగొడుతున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లోని బిఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ పేరిట ఓపెన్ మైన్స్ ను ఆంధ్ర బడా బాబుల కంపెనీలకు కట్టబెట్టి కార్మికుల నోటికాడ బుక్క గుంజుకున్న కఠినాత్ముడు కేసీఆర్ అని నిప్పులు చెరిగారు. ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయకుండా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గాడిదలు కాస్తున్నదా అంటూ ఫైర్ అయ్యారు.

బీపీఎల్ కంపెనీ ఏర్పాటు కోసం 1200 ఎకరాలు భూసేకరణ చేసి దశాబ్ద కాలమవుతున్న ఇప్పటివరకు కంపెనీ ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారు. కంపెనీ ఏర్పాటు చేయకుంటే సేకరించిన భూములను వెంటనే రైతులకు ఇవ్వండి లేకుంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసమైనా ఆ భూములను కేటాయించాలని డిమాండ్. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో అవుట్ ఏజెన్సీ సంస్థను సృష్టించి కాంట్రాక్టు లేబర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేయడం ఇంతకంటే దుర్మార్గం ఉందా? అని ప్రశ్నించారు. ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించకపోగా వసూలు చేసిన డబ్బులు బాధితులకు చెల్లించకపోవడంతో నలుగురు ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే ఈ రామగుండానికి అవసరమా ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.

నగరం నడిబొడ్డున ఓపెన్ కాస్ట్ మైనింగ్లతో చిన్నపాటి భూకంపాలు వస్తున్న వాటిని రద్దు చేయించాలన్న సోయి ఎమ్మెల్యేకు లేకపోవడం విచారకరం అన్నారు. ఇసుక దందా, బూడిద దందాలతో కాలం వెళ్లదీయడానికే ఎమ్మెల్యే గా గెలిచావా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే దందాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం ఇదేమి ప్రజాస్వామ్యం. రామగుండంలో భావ స్వేచ్ఛ లేకుండా చేస్తున్న ఎమ్మెల్యే అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, బూడిది, నీళ్లు తో పాటు రాబోయే రోజుల్లో గాలిని కూడా అమ్మే దుస్థితికి టిఆర్ఎస్ దిగజారిపోయిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. 
పెద్దపల్లి జిల్లా మినరల్ ఫండ్స్ నిధులను జిల్లా అవసరాల కోసం ఖర్చుపెట్టకుండా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. బొగ్గు ఖనిజ సంపద ఉన్న రామగుండం ప్రజలు తెలంగాణలో లేరా? వీరి సొమ్ము తీసుకెళ్లడానికి హక్కు ఎక్కడిది అన్నారు.

కెసిఆర్ దోపిడికి కళ్లెం వేయడం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే సాధ్యం పెళ్లి స్పష్టం చేశారు. దోపిడి పాలనకు చరమ గీతం పాడుదాం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు మక్కాన్ సింగ్ ఠాకూర్ రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.