కాళేశ్వరం దేశానికి ‘ఆదర్శం’

కాళేశ్వరం దేశానికి ‘ఆదర్శం’
  • అన్ని రంగాల్లో తెలంగాణ  అభివృద్ధి
  • పంజాబ్​ సీఎం భగవంత్​సింగ్​ మాన్​
  • సీఎం కేసీఆర్​ ఆహ్వానం మేరకు నాలెడ్జ్​ షేరింగ్​
  • కొండపోచమ్మ, ఎర్రవల్లి చెక్​డ్యాం, గజ్వేల్​ పాండవుల చెరువు సందర్శన


ముద్ర తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం యావత్​ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​సింగ్​ మాన్​ అన్నారు. సీఎం కేసీఆర్​  ఆహ్వానం మేరకు నాలెడ్జ్ షేరింగ్ లో భాగంగా రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని  పరిశీలించేందుకు తెలంగాణకు వచ్చానని తెలిపారు.  గురువారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన  సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను,కొండపోచమ్మ పంప్ హౌస్ ను, ఎర్రవల్లిలోని చెక్ డాంను అనంతరం గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును భగవంత్​సింగ్​ మాన్​ పరిశీలించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర నీటిపారుదల శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు,   రాష్ట్ర అభివృద్ధిలో ప్రాధాన్యత, దాని నిర్మాణం, నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​  తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను వివరించారు. 500 మీటర్ల పైకి గోదావరి నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసి మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం  చేయడం ఆదర్శనీయమని భగవంత్​సింగ్​మాన్​ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల, పారిశ్రామిక, వైద్య, ఆరోగ్యం తదితర అన్ని రంగాలలో  అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు.   రాష్ట్రంలో నిర్మించిన రిజర్వాయర్లు, చెక్ డాములు భూగర్భ జలాల పెంపునకు అత్యధికంగా ఉపయోగపడుతున్నాయని,  తెలంగాణ నీటిపారుదల మోడల్ దేశానికి ఆదర్శమని తెలిపారు. 1947 ముందే నుండి పంజాబ్ రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసారంగాలు అభివృద్ధి సాధించాయని ఆయన వివరించారు.  


పంజాబ్​ అంటేనే ఐదు నదుల సంగమం
 పంజాబ్ అంటేనే ఐదు నదుల సంగమమని ,  భాక్రానంగల్ లాంటి గొప్ప ప్రాజెక్టులతో పంజాబ్ దేశంలోనే ఆహార ఉత్పత్తిలో ప్రథమంగా ఉండేదని మాన్​ తెలిపారు. కానీ భూగర్భ నీటి వనరులను అధికంగా ఉపయోగించడం మూలంగా ప్రస్తుతం పంజాబ్ లోని కొన్ని జిల్లాల్లో  భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి  చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ లో 80%  భూగర్భ నీటి లభ్యత విషయంలో  డార్క్ జోన్ లో ఉందన్నారు. 


తెలంగాణ మోడల్​ అనుసరణీయం 
తెలంగాణ మోడల్ ని అనుసరించి  పంజాబ్ లో కూడా చెక్ డాములు విరివిగా నిర్మించి జల సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపడుతామని భగవంత్​ తెలిపారు. భూగర్భ నీటి వనరులను కాపాడేందుకు పంజాబ్​లో క్రాఫ్ట్ డైవర్షన్ పద్ధతిని అనుసరిస్తున్నామన్నారు.  పంజాబ్ లో గల పాతకాలం నాటి నీటిపారుదల వ్యవస్థను తెలంగాణ మాదిరిగా  ఆధునికీకరించి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.  పంజాబ్ రాష్ట్రంలో మార్చి నెలలో రాష్ట్ర బడ్జెట్​ను  ప్రవేశపెట్టనున్నామని,  ఈ బడ్జెట్లో నీటిపారుదల, పారిశ్రామిక రంగానికి  ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పంజాబ్ వ్యవసాయ రంగంతో పాటు,  యువత   దేశ రక్షణలో అధిక భాగస్వామ్యం ఉందని తెలిపారు. ప్రపంచంలో 80 శాతం శాతం బాస్మతి రైస్ పంజాబ్​ నుంచి ఎగుమతి అవుతున్నదని వివరించారు. గత ప్రభుత్వాల పాలనలో  నిర్లక్ష్యానికి గురైన పంజాబ్ ను మళ్లీ ప్రాచీన కాలం నాటి  పంజాబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రకటించారు .కేంద్ర ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో  కేసీఆర్​విద్య, వైద్యం తదితర రంగాలలో అమలు చేస్తున్న వినూత్న పథకాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకర్శిస్తున్నాయని మాన్​ పేర్కొన్నారు.