ఆరు రోజుల్లో వివాహం

ఆరు రోజుల్లో వివాహం
  • రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి
  • పెండ్లింట విషాదం
  • బోరుమంటున్న వధువు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : నాలుగేళ్ళ కల సాకారం కాబోతుంది... ఆరు రోజుల్లో ప్రేమించిన యువతితో మనువు జరగబోతోందని కోటి ఆశలతో ఊహలోకం లో తేలియాడుతున్న యువకున్ని మృత్యువుకబలించింది. వరుడు కొండేటి సాయి (24) రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో అంతిమ శ్వాస విడిచి పెండ్లి ఇంట విషాదాన్ని నింపాడు. వివరాలలోకి వెళితే...లక్షేట్టిపెట్ మండలం లోని కొత్త కొమ్ముగూడెంకు చెందిన కొండేటి సత్తయ్య, లక్ష్మిల కుమారుడైన సాయి నిర్మల్ లో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ గా పని చేస్తున్నాడు. బంధువుల అమ్మాయి కావ్యతో నాలుగేళ్ళుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో గత నిశ్చితార్థం జరిగింది. ఈనెల 11వ తేదీన పెండ్లి కుదిర్చారు. గురువారం విధులకు సెలవు పెట్టడానికి మిత్రుడు కాటుకూరి మహేష్ తో కలిసి నిర్మల్ కు ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు.

తిరుగు ప్రయాణమై కొద్దీ నిమిషాల్లో ఇంటి చేరుకుంటామనే ఆనందంలో ఉండగా హార్వెస్టర్ మృత్యు రూపంలో వచ్చింది. దండేపల్లి మండలం మ్యాదరిపేట వద్ద జాతీయ రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తున్న హార్వెస్టర్ వాహనం ఏదీరుగా వస్తున్న వాహనాన్ని తప్పించపోయి సాయి ద్విచక్ర వాహనం ను ఢీకొట్టాడు. ధీంతో తీవ్రగాయలైన సాయి అక్కడిక్కడే మృతి చెందగా గాయపడిన మహేష్ ను కరీంనగర్ పెద్దాసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. సాయి మరణ వార్త తెలియడం తో వరుడు, వధువు ఇంట్లో రోదనలు మిన్నంటాయి. ఇక వధువు కావ్య రోదనలు కలచివేశాయి. ప్రేమించిన సాయితో ఏడడుగుల బంధం ముడిపడపోతుందని ఆశించిన కావ్య కళల సౌధం కుప్పకూలిపోవడంతో గుండెలవిసేలా దుక్కిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్క కాలేదు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇరు కుటుంబాల్లో చావుబాజాలు మోగడం బంధువులు, స్థానికులను కలచివేసింది.