నందిగామ సి.ఐ. పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
![నందిగామ సి.ఐ. పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_650432606400e.jpg)
హుజూర్ నగర్ టౌన్ ముద్ర:ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో న్యాయవాదిగా పనిచేస్తున్న కోట రాజు పై నందిగామ రూరల్ సీ.ఐ. దురుసుగా ప్రవర్తించి, న్యాయవాది రాజు కాలర్ పట్టుకుని లాగి, దాడికి పాల్పడినందుకు నిరసిస్తూ శుక్రవారం పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ గౌరవప్రదమైన న్యాయవాది పట్ల దురుసుగా ప్రవర్తించటం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భౌతిక దాడికి పాల్పడటం దారుణమైన విషయమన్నారు. సి.ఐ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ అదనపు జిల్లా న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్, జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ లకు తీర్మాన కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, నట్టే సత్యనారాయణ, చల్లా కృష్ణయ్య, చనగాని యాదగిరి, వట్టికూటి అంజయ్య, రమణారెడ్డి, మీసాల అంజయ్య, రాఘవరావు, కొట్టు సురేష్, మామిడి వెంకయ్య, పాలేటి శ్రీనివాసరావు, మునగపాటి గోపీనాథ్, సైదా హుస్సేన్, పసుపులేటి వీరయ్య, రామ లక్ష్మారెడ్డి, అడవి రాముడు, శంకర్ నాయక్, శ్రీను నాయక్, బుడిగే నరేష్ తదితరులు పాల్గొన్నారు.