ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేశ్...

ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేశ్...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్లలోనూ తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేశ్.. మంత్రిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలుకు తాజాగా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు  శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను విన్నవించగా.. వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


నారా లోకేశ్ ప్రజలకు అందుబాటులో ఉండరంటూ 2019లో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. అయితే, అప్పుడు గెలిచిన వైసీపీ నేత ఐదేళ్లూ పత్తాలేకుండా పోయారు. ఓటమి పాలైన లోకేశ్ మాత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తన స్వంత నిధులతో నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారు. దీంతో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత చేరువగా వెళ్లేందుకు ప్రజాదర్బార్ నిర్వహించాలని లోకేశ్ నిర్ణయించారు. నియోజకవర్గంలో ఉన్నపుడు ప్రతిరోజూ ప్రజాదర్బార్ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రజానేతగా లోకేశ్ వేసిన ఈ తొలిఅడుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం కానుంది.