అవినీతి భరతం పట్టేందుకు మోదీ మరో కఠిన నిర్ణయం

అవినీతి భరతం పట్టేందుకు మోదీ మరో కఠిన నిర్ణయం

న్యూఢిల్లీ : పెచ్చు మీరుతున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సంపదపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తూ, క్రిప్టోకరెన్సీ రంగానికి మనీలాండరింగ్ చట్టాన్ని వర్దింపజేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటీసులో ఈ వివరాలను తెలిపింది. క్రిప్టో ట్రేడింగ్, సేఫ్ కీపింగ్ సంబంధిత ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు యాంటీ మనీలాండరింగ్ చట్టాన్ని వర్తింపజేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటీసు తెలిపింది. క్రిప్టోకరెన్సీ రంగంపై గత ఏడాది కఠినమైన పన్ను నిబంధనలను అమలు చేసింది. క్రిప్టో ట్రేడింగ్‌పై లెవీని కూడా విధించింది. ప్రభుత్వ నిబంధనలతోపాటు అంతర్జాతీయంగా డిజిటల్ అసెట్స్‌ దెబ్బతినడంతో మన దేశంలో క్రిప్టో ట్రేడింగ్ పరిమాణం తగ్గింది. బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు యాంటీ మనీలాండరింగ్ ప్రమాణాలను పాటిస్తారు. ఇదే విధంగా డిజిటల్ అసెట్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఈ ప్రమాణాలను పాటించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గట్టిగా చెప్తున్నాయి. భారత ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని అమలు చేయాలంటే వనరులు, సమయం అవసరమవుతాయి.